హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా జరగనున్న జనగణనలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కాలమ్ చేర్చకుండా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. ఈ అంశంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బీసీ సంఘం ప్రతినిధులు గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో బీసీ వర్గాలకు చెందిన 51 కులాలను సంచార జాతులు, డీఎన్టీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో 10 విడుదల చేయడం పట్ల సీఎంకు జాజుల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది సంచార జాతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి 'విముక్తి దినోత్సవాన్ని' అధికారికంగా రాష్ట్ర పండుగగా జరపాలని కోరారు. ఈ నెలాఖరులో నిర్వహించనున్న సంచార జాతుల విముక్తి దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని సీఎంను కోరారు.
